తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కార్పోరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, టిఆర్ఎస్ పార్టీ 33 డివిజన్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా సునీల్రావు పేరును టిఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. మేయర్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వు కావడంతో ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు పలువురు కార్పోరేటర్లు ప్రయత్నించగా టిఆర్ఎస్ అధిష్టానం సునీల్ రావు వైపే మొగ్గు చూపింది. ఇక్కడ గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు సైతం టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో టిఆర్ఎస్ బలం 40కి పైగా పెరిగింది. ఈ రోజు జరిగిన తొలి నగర పాలక మండలి సమావేశంలో ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మేయర్ గా సునీల్ రావును, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణిని ఎన్నుకున్నారు.
[subscribe]