టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జనవరి 28, మంగళవారం నాడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలతో కేటీఆర్ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై ఈ సమావేశంలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో గళమెత్తాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో గట్టిగా ప్రశ్నించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ మరియు ఇతర బకాయిలపై పార్లమెంటులో నిలదీయాలని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో అమలుచేసున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసుల పట్ల కేంద్రం స్పందించకపోవడాన్ని ప్రస్తావించాలని సూచించారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)నికి వ్యతిరేకంగా పార్టీ వైఖరిని ప్రదర్శించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విభజన చట్టం హామీల అమలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన పలు అంశాలపై పార్టీ ఎంపీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
[subscribe]