ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జనవరి 29, బుధవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సైనా నెహ్వాల్ కి పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశారు. సైనా సోదరి చంద్రాన్షు నెహ్వాల్ కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ ‘ నేను దేశం కోసం ఎన్నో పతకాలు సాధించాను. అందుకోసం చాలా కష్టపడి పనిచేసే దాన్ని, అలాగే కష్టపడి పనిచేసే వ్యక్తులను నేను అభిమానిస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం ఎంతగానో కృషి చేస్తున్న విధానాన్ని చూసి ప్రేరణ పొందాను. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని’ చెప్పారు.
బ్యాడ్మింటన్ లో మాజీ ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి అయినా సైనా నెహ్వాల్, దేశంలోని అగ్రశ్రేణి క్రీడా అవార్డులైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న మరియు అర్జున అవార్డులను పొందింది. అలాగే 2016లో ఆమెకు పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ 24 అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకుంది. లండన్ ఒలింపిక్స్లో ఆమె కాంస్యం గెలుచుకోగా, 2009 లో ప్రపంచ నంబర్ టూ స్థానంలో, 2015లో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో కొనసాగింది.
[subscribe]