జనవరి 28, మంగళవారం నాడు విజయవాడలో బీజేపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు తదితరులు హాజరుకాగా, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, టి.శివ శంకర్ ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో కమిటీలను నియమించనున్నారు. ఇరు పార్టీల అధ్యక్షులు కమిటీ సభ్యులను ఎంపిక చేయనున్నారు.
అలాగే రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల దగ్గరకు జనసేన-బీజేపీ పార్టీల సభ్యుల బృందం వెళ్లి అండగా నిలవాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. రైతులకు భరోసా కల్పించాలని, రాజధాని అమరావతి విషయంలో ఇరు పార్టీలు కలిసి పోరాటం చేయాలని సంకల్పించాయి. అమరావతిలో ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులకు నాడు అధికారంలో ఉన్న టీడీపీ , నేడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలు బాధ్యులే అని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని మార్పులపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాకే చేస్తున్నామని వైసీపీ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఈ సమావేశంలో సభ్యులు ఖండించారు.
[subscribe]