భారత్లో తోలి కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆ విద్యార్థి, కరోనా కలకలంతో భారత్ కు తిరిగి వచ్చాడు. ‘కేరళ విద్యార్థికి నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ జరిగింది. అతని ఆరోగ్యం స్థిరంగా ఉంది మరియు వైద్యుల పర్యవేక్షణలో నిశితంగా పరిశీలించబడుతున్నాడు’ అని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన ఈ కరోనా వైరస్ వలన ఇప్పటికే అక్కడ 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ పలు ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుంది. భారత్ పొరుగుదేశాలైన శ్రీలంక, నేపాల్లో అధికారికంగా ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ దేశంలో వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ వైరస్ పై సమాచారం కోసం 24X7 హెల్ప్లైన్ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ వైరస్కు సంబంధించి ఎలాంటి సందేహాలు, అనుమానాలున్నా 011-23978046 నెంబరుకు ఫోన్ చేసి ప్రజలు నివృత్తి చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు.
[subscribe]