కుమురంభీం జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సమత హత్యోదంతం కేసులో జనవరి 30, గురువారం నాడు ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో షేక్బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూంలను కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ, వారికీ మరణ శిక్ష విధించింది. ఈ రోజు తీర్పు నేపథ్యంలో బాధితురాలి గ్రామస్తులు, నిందితుల కుటుంబ సభ్యులు, ఇతరులు ఆదిలాబాద్ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు వద్దకు భారీగా చేరుకోవడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎల్లాపటార్ గ్రామం సమీపంలో సమతపై నిందితులు షేక్బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మక్దూం సామూహిక హత్యాచారానికి పాల్పడి, కత్తితో పొడిచి ఆమెను హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా, హైకోర్టు ఆదేశాల మేరకు తత్వర విచారణ నిమిత్తం డిసెంబర్ 11న ఆదిలాబాద్లో ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 14న ఛార్జిషీటు దాఖలుకాగా, డిసెంబర్ 23 నుంచి 31వరకు ఈ కేసులో సాక్షుల విచారణ కొనసాగింది. జనవరి 10, 20 తేదీల్లో ప్రాసెక్యూషన్, డిఫెన్స్ వాదనలు ముగియడంతో జనవరి 27న తుదితీర్పు వెలువడాల్సి ఉంది. న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో జనవరి 30వ తేదీకి తీర్పు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పు వెలువరించింది.
[subscribe]