ప్రసిద్ధ బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటుగా ముధోల్ ఎమ్మెల్యే గద్దిగారి విఠల్ రెడ్డి కూడా ఉన్నారు. ఈసందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో అన్ని రంగాల్లో దూసుకెళుతూ గొప్ప విజయాలు సాధిస్తుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సారధ్యంలో అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యతను సాధించే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కృషి చేయాలని కోరారు. బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుందని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాసర క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేస్తామని చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం రూ.25 లక్షలతో నిర్మించిన షెడ్ ను ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
[subscribe]