‘శ్వాస మీద ధ్యాస’ పెట్టడమే ధ్యానం అని సామాన్యులకి కూడా అర్ధమయ్యేలా చెప్పి లక్షల మందిని ధ్యానం వైపు మరల్చిన ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2 రోజుల క్రితం ఆయనను కడ్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ధాన్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పత్రీజీ కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు కడ్తాల్ లోని మహా పిరమిడ్ వద్ద నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.
గత నాలుగు దశాబ్దాలుగా ధ్యానంపై అలుపెరగని ప్రచారం చేస్తూ ఎంతోమందిని ధ్యానం వైపు మరల్చిన సుభాష్ పత్రీజీ 1947లో బోధన్లోని శక్కర్నగర్లో పీవీ రమణారావు, సావిత్రీదేవిలకు జన్మించారు. ఆధ్యాత్మికంగా సాధన చేస్తూ 1990లో కర్నూల్ స్పిరిచ్యువల్ సొసైటీ (పిరమిడ్ కేంద్రాన్ని) స్థాపించారు. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని కూడా ప్రజలకు పంచాలని భావిస్తూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో 2008లో ‘మహేశ్వర మహాపిరమిడ్’ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో 2012 నుంచి ‘ధ్యానమహా చక్రాలు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఏటా లక్షలాది మందితో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకుపైగా పిరమిడ్లను నిర్మించారు.
అయితే తాను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నట్లు ముందుగానే చెప్పారని శిష్యులు పేర్కొంటున్నారు. తాను ఆధ్యాత్మిక సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చానని, ఇక ఈ దేహాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారని వారు పేర్కొన్నారు. పత్రీజీ ప్రకటన శిష్యులను ఆందోళనకు గురి చేసినా.. మరణమంటే శరీరం నుంచి ఆత్మ వేరు కావడమేనని, దీనికి దుఃఖించాల్సిన పనిలేదని, అందుకే మరణాన్ని సైతం సంబరం చేసుకోవాలని ఆయన చేసిన సూచన ప్రకారం 3 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన శిష్యులు ప్రకటించారు. కాగా పత్రీజీకి భార్య స్వర్ణమాల, కుమార్తెలు పరిణత, పరిమళ ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY