టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు స్పందించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు ఆరోపణలతో ఆడబిడ్డ నివాసంలోకి దూసుకెళ్లడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, టీఆర్ఎస్ దాడులకు పాల్పడితే బీజేపీ నేతలు స్వేచ్ఛగా బయట నడవగలరా అని ఆయన ప్రశ్నించారు. అలాగే మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా దీనిపై స్పందిస్తూ.. ఒక మహిళా నాయకురాలి ఇంటిపై అంతమంది దౌర్జన్యంగా దాడి చేయడం విచారకరమని, ఇదేనా బీజేపీ సంస్కారం అని ఆయన నిలదీశారు. మరోవైపు ఈ ఘటనను ఖండిస్తూ టీఆర్ఎస్ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గణేశ్ గుప్తా, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి బీజేపీ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు సంబంధాలున్నాయని బీజేపీ ఎంపీ ఆరోపించడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ అంశంపై బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీ కవితను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆమె తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు ఏ సంబంధం లేదని, దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని కవిత స్పష్టం చేశారు.
ఈ క్రమంలో సోమవారం ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ, బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసులు కవిత ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కవిత ఇంటిపై దాడికి సంబంధించిన ఘటనలో.. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు మొత్తం 26 మందిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఐసీపీ 341, 147, 148, 353, 332, 509 రెడ్విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY