ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ మినహా మిగతా పార్టీలు సెలక్ట్ కమిటీల కోసం సభ్యుల పేర్లను ఇచ్చిన అనంతరం సెలక్ట్ కమిటీలను నియమిస్తూ మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు చెందిన సెలెక్ట్ కమిటీకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని, సీఆర్డీఏ రద్దు బిల్లుకు చెందిన సెలెక్ట్ కమిటీకి బొత్స సత్యనారాయణను ఛైర్మన్లుగా నియమించారు. అయితే సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ను శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్ బాబు, నాగజగదీష్, బచ్చుల అర్జునుడు, తదితరులు ఫిబ్రవరి 10, సోమవారం నాడు మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను కలిశారు. సెలక్ట్ కమిటీని తక్షణమే వేయాలని, అందుకు సంబంధించి మండలి ఛైర్మన్ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఈ సందర్భంగా వారు కార్యదర్శిని కోరారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ, శాసనమండలి సెక్రటరీ సెలక్ట్ కమిటీ ఫైల్ ను ఆపడం సరికాదని, రాజ్యాంగ విధానాలు, చట్టాల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవంలేదని విమర్శించారు. సెలక్ట్ కమిటీల అంశంపై న్యాయపోరాటానికి దిగుతామని, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీలు తెలిపారు. మరోవైపు మండలి కార్యదర్శితో వైసీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా సమావేశమై సెలక్ట్ కమిటీల అంశంపై చర్చించారు.
[subscribe]