ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఈఏపీ (ఎక్స్టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై సమీక్ష నిర్వహించారు. న్యూడెవలప్మెంట్ (ఎన్డీబీ) బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్బీ బ్యాంకుల రుణసహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులనూ సీఎం సమీక్షించారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ.25,497.28 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూసుకోవాలని, నిర్దేశిత సమయంలోగా వివిధ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ సమీక్ష సందర్భంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని సీఎం అన్నారు. “నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలి. ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే, అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలి. ఈ చెరువులన్నింటినీకూడా గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలి. దీనివల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయి, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుంది. చెరువు కింద చక్కగా భూములు సాగు జరుగడంతో పాటుగా, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయి. ఒక సమగ్రమైన అధ్యయనం చేసి, ఈప్రాజెక్టును చేపట్టాలి. ప్రపంచబ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో దీన్ని చేపట్టాలి” అని అధికారులను సీఎం ఆదేశాలు ఇచ్చారు.
ఇక పనులు పూర్తిచేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నాం. వీటిచుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి కాబట్టి, వాటి పరిధిలో ల్యాండ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం అన్నది చాలా అవసరం. దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అధికారులతో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ పి.రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY