ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల ఆదుకునేందుకు వెంటనే ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరితగతిన కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం భారీ వర్షాల వలన రూ.6054.29 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని, తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు.
“రాష్ట్రంలో నాలుగు రాయలసీమ జిల్లాలతో పాటుగా, నాలుగు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమల, నెల్లూరు టౌన్, మదనపల్లె, రాజంపేట టౌన్ లో భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీటమునగడంతో జనజీవనం స్తంభించింది. మొత్తం 196 మండలాలలోని 1402 గ్రామాలు ఈ వర్షాలతో ప్రభావితమయ్యాయి. 17 ఎన్డీఆర్ఎఫ్/ఎస్డీఆర్ఎఫ్ మరియు రెండు హెలికాఫ్టర్ల సహాయంతో చర్యలు చేపట్టాం, అలాగే 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. పెద్దఎత్తున ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ సహాయక చర్యల్లో పాల్గొన్న ఒక ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ సహా 40 మంది చనిపోయారు, 25 మంది గల్లంతు అయ్యారు. వ్యవసాయ పంటలు, హార్టికల్చర్ పంటలకు భారీగా నష్టం జరగగా, పలు జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలకు కోతలకు గురయ్యాయి. దీంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడం, మౌలిక సదుపాయాల నష్టాన్ని పునరుద్ధరించడం, వరదల వలన ఏర్పడిన పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటూ ఆర్ధిక సహాయం అందించాలని కోరుతున్నాను” అని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ