న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ ను 5-0 తో గెలుచుకున్న భారత్ వెనువెంటనే వన్డే సిరీస్ లో పరాభవం ఎదుర్కోవడంతో క్రీడాభిమానులు నిరాశ చెందారు. వన్డే సిరీస్లో 31 ఏళ్ల తర్వాత భారత్ జట్టు వైట్ వాష్కు గురవడం గమనార్హం. మూడో వన్డే అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో ఈ ఓటమిపై భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ వన్డే సిరీస్లో భారత్ ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వన్డే సిరీస్ లో భారత్ బౌలింగ్, ఫీల్డింగ్ అంతర్జాతీయ స్థాయిలో లేవని, మ్యాచ్ లు గెలిపించడానికి తమ జట్టు చేసిన ప్రయత్నాలు సరిపోవని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. జట్టు స్కోర్ల ప్రకారం చూస్తే మరీ చెత్తగా ఆడామని చెప్పలేం కానీ, అందివచ్చిన అవకాశాలను జట్టు సద్వినియోగం చేసుకోలేదని చెప్పాడు. అయితే కఠిన పరిస్థితుల్లో బ్యాట్స్మెన్ పుంజుకోవడం మాకు సానుకూలం. మేం బౌలింగ్, ఫీల్డింగ్ల్లో చూపెట్టిన తీవ్రత మ్యాచులను గెలిపించలేదు, అలాంటప్పుడు జట్టుకు గెలిచే అర్హత ఉండదని కోహ్లీ పేర్కొన్నాడు.
టీ20 సిరీస్ ఓటమి తర్వాత న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్లో మరింత కసిగా ఆడిందని, అయితే పట్టుదల, కసిగా లేకుండా తాము వెనుకబడిపోయామని కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక టెస్టు ఛాంపియన్షిప్లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ సుదీర్ఘ ఫార్మాట్లో భారత్ కు అనుభవమున్న స్థిరమైన జట్టు ఉంది. టెస్టు సిరీస్ గెలుచుకోగల సత్తా ఉంది. అయితే సరైన ప్రణాళిక, మానసిక ధోరణితో సిద్ధమై మైదానంలో అడుగుపెట్టాలని కోహ్లీ తెలిపాడు. ఇక ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 21 నుంచి తోలి టెస్టు, ఫిబ్రవరి 29 నుంచి రెండో టెస్టు జరగనున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 14 నుంచి న్యూజిలాండ్ ఎలెవన్ తో భారత్ మూడురోజుల ప్రాక్టీసు మ్యాచ్ ఆడనుంది.