ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం), శాసనమండలి రద్దు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీకి వివరించనున్నారు. అలాగే మార్చి 2 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే ఏపీ శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చొరవ తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం. రాష్టానికి ప్రత్యేక హోదాతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం గతంలో సీఎం వైఎస్ జగన్ మోదీకి రాసిన లేఖలోని అంశాలను ఈ భేటీ సందర్భంగా ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, విభజన అంశాలు పరిష్కారం, దిశా చట్టానికి రాష్ట్రపతి ఆమోదం వంటి అంశాలపై ఈ భేటీలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
ముందుగా బుధవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీకి చేరుకొని సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు.
[subscribe]