ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 63 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలోనే లేకుండా పోవడం విశేషం. ఎన్నికల ఫలితాలపై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు తనను కొడుకుగా భావించి ఓటేశారని, ఇంతటి ఘనవిజయం వారిదేనని ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారని, ఈ విజయంతో “పాలిటిక్స్ అఫ్ వర్క్” విధానం మొదలైందన్నారు. ప్రజలకు కల్పించిన సౌకర్యాలే ఈ గెలుపుకు నిదర్శనమని, ఇది యావత్ భారతావని విజయమని పేర్కొన్నారు. మరో ఐదేళ్ల పాటు మనమంతా కలిసి పనిచేద్దామని కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2015లో ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేసినట్టుగానే, మరోసారి 2020 ఫిబ్రవరి 14న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడంతో పలువురు రాజకీయ ప్రముఖులు అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు తెలియజేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, పలువురు నాయకులు, కేంద్ర మంత్రులు ఢిల్లీని మరింత అభివృద్ధి దిశలో నడిపించాలని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కేజ్రీవాల్ ఆనందాన్ని పంచుకున్నారు. ఆప్ కార్యాలయంలో ప్రశాంత్ కిశోర్ తో ఎన్నికల ఫలితాలను చర్చించి పరస్పరం అభినందించుకున్నారు. మరోవైపు ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, భారత ఆత్మను రక్షించేందుకు వెన్నంటి నిలిచారంటూ ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో మరోసారి తమ పార్టీ అధికారంలోకి రానుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేక చోట్ల సంబరాల్లో మునిగి తేలారు.
[subscribe]