తెలంగాణ గడ్డపై పుట్టి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. పైడి జైరాజ్ 113వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. జాతీయ చలన చిత్ర పరిశ్రమకు పైడి జైరాజ్ అందించిన సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
భారతీయ సినిమా తొలి దశలో ప్రారంభమైన మూకీల నుండి టాకీల వరకు సాగిన పైడి ప్రస్థానం గొప్పదన్నారు. భారతీయ వెండి తెరపై మొట్టమొదటి “యాక్షన్ హీరో” పైడి జైరాజ్ కావడం తెలంగాణకు గర్వకారణమని సీఎం అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా వేళ్ళూనుకొని ప్రారంభ దశనాటికే, బాలీవుడ్ లో పైడి జైరాజ్ అగ్ర హీరోగా రాణించడం గొప్పవిషయమన్నారు. తనదైన నటనా కౌశలంతో పాటు, దర్శకునిగా, నిర్మాతగా రాణించి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తరం తెలంగాణ సినిమా నటుడు పైడి జైరాజ్ తెలంగాణ సినిమా రంగానికి మూల పురుషుడని సీఎం కొనియాడారు.
హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలి, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం పలు జాతీయ భాషల్లో దాదాపు 300 చిత్రాలకుపైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచారని సీఎం అన్నారు. తెలంగాణ నేలనుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన గొప్పవారిలో పైడి ఒకరని సీఎం అన్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తుగా, రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలోని సమావేశమందిరానికి ‘పైడి జై రాజ్ ప్రివ్యూ థియేటర్’ గా పేరు పెట్టుకుని గౌరవించుకున్నామని సీఎం గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ కృషితో తెలంగాణ యాస భాషా సంస్కృతులకు సినీ పరిశ్రమలో ప్రాముఖ్యత, సాహితీ గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాంస్కృతక శాఖ ద్వారా, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ యువత సినిమా పరిశ్రమలో పలు విభాగాల్లో గొప్పగా రాణిస్తున్నదని సీఎం తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ సినిమా రంగం మరింతగా రాణించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY