గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే 132 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా బ్రిడ్జి కూలిన సమయంలో దానిపై 500 మందికిపైగా సందర్శకులు ఉన్నట్టు తెలుస్తుంది. మోర్బిలోని ప్రధాన పర్యాటక ప్రదేశంగా ఉన్న ఈ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం పెద్దసంఖ్యలో సందర్శకులు చేరుకోవడంతో 6.30 గంటల ప్రాంతంలో బ్రిడ్జి కూలిపోయింది. మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. ఒక్కసారిగా బ్రిడ్జి కూలడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రాష్ట్ర బలగాలు, త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనలో గాయపడి మోర్బి సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవైపు మచ్చు నది నుండి మృతదేహాలను వెలికితీత కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఈ ఘోర ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఈ సస్పెన్షన్ బ్రిడ్జిని బ్రిటిష్ కాలంలో నిర్మించారు. దాదాపు140 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జిని మరమ్మత్తు పనుల నిమిత్తం గత ఏడు నెలల పాటు మూసి వేశారు. మరమ్మతులు పూర్తైన అనంతరం అక్టోబర్ 26న గుజరాతీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మళ్ళి ఓపెన్ చేసి సందర్శకులకు అనుమతులు ఇచ్చారు. ఓపెన్ చేసిన నాలుగు రోజులకే ఊహించని ఈ ఘటన చోటుచేసుకోవడంతో వందల కుటుంబాల్లో విషాదం నెలకుంది. మరోవైపు ఈ బ్రిడ్జి కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు అధికారులు మరియు పోలీసులతో కూడిన ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్టు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE