హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (నవంబర్ 12, శనివారం) ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా, సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగనుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఓటర్లు సంఖ్య 55,07,261, సర్వీస్ ఓటర్ల సంఖ్య 67,532 కలిపి మొత్తం 55,74,793 ఓటర్లు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ పక్రియ కోసం మొత్తం 7,881 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యనే కీలక పోటీ నెలకుంది. ఈ మూడు పార్టీలు మొత్తం 68 స్థానాల్లో పోటీ చేస్తుండగా, సీపీఎం 11, సీపీఐ 1, బీఎస్పీ 53, ఆర్డీపీ 29 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. గత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44, కాంగ్రెస్ 21, ఇండిపెండెంట్స్ 2, సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ విస్తృత ప్రచారం నిర్వహించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ సహా 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారం చేయగా, కాంగ్రెస్ నుండి ప్రియాంక గాంధీ వాద్రా మరియు ఆప్ నుంచి ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించారు. బీజేపీ నేత, హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉండగా, ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి చేత్రమ్ ఠాకూర్, ఆప్ నుంచి గీతా నంద్ ఠాకూర్ బరిలో నిలిచారు. హరోలి, మండి, సిమ్లా రూరల్, హమీర్పూర్ నియోజకవర్గాల్లో కూడా ఈ మూడు పార్టీల మధ్య కీలక పోరు జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు 2023, జనవరి 8వ తేదీతో ముగియనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE