సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వెలిమెల నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి(16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఫిబ్రవరి 26, బుధవారం నాడు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సంధ్యారాణి మృతదేహాన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆమె తల్లిదండ్రులు, విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మృతురాలి తండ్రిని కానిస్టేబుల్ శ్రీధర్ బూట్ కాళ్లతో తన్నారు. ఈ సంఘటనతో పోలీసులు ప్రవర్తనా తీరుపై ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. దుఃఖంలో ఉన్న మృతురాలి తండ్రిపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు, విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి అధికారులు అండగా నిలవాలంటూ కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ శ్రీధర్ పై సస్పెన్షన్ వేటు పడింది. మృతురాలి తండ్రి చంద్రశేఖర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ పై సస్పెన్షన్ విధించి చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు.
[subscribe]