దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈశ్వరీబాయి జయంతిని పురస్కరించుకొని సీఎం ఆమెకు నివాళులర్పించారు. రాజకీయ నాయకురాలిగా, సామాజికవేత్తగా, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారిణిగా ఆమె సాగించిన సాహస పోరాటాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. స్త్రీకి స్వేచ్ఛ కరువైన నాటి కాలంలో ఈశ్వరీబాయి ఒక దళిత మహిళగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తీరు నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. తెలంగాణ గర్వించే బిడ్డగా ఈశ్వరీబాయి అనుసరించిన విలువలు స్ఫూర్తిని రేపటి తరానికి అందించాలనే లక్ష్యంతో, గత పాలనలో విస్మరించబడిన ఈశ్వరీబాయి జయంతిని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు.
ఈశ్వరీబాయి వంటి ప్రజాస్వామిక వాదుల ఆశయాల ప్రేరణతో, తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారతను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని సీఎం పునరుద్ఘాటించారు. ఈశ్వరీబాయి వంటి దళిత ప్రజాస్వామిక వాదుల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం అన్నారు. దళితుల ఆర్థిక సామాజిక ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దిశగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దళిత బహుజన, మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను కొనసాగించాలనే స్పృహను యావత్ దేశంలోని పాలక వ్యవస్థకు కలిగించేందుకే తెలంగాణ సచివాలయానికి డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని, 125 అడుగులతో, దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం అన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ప్రేరణగా నిలుస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE