హైదరాబాద్లో నుమాయిష్ సందడి మొదలయిపోయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనవరి 1 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయిన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ 83వ ఎగ్జిబిషన్కు అప్పుడే అపూర్వ స్పందన వస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వ తేదీ వరకు.. 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఎగ్జిబిషన్ను సందర్శించడానికి ఉన్న సమయాలలో ఎలాంటి మార్పులు కూడా చేయని నిర్వాహకులు.. టికెట్ ధరలను మాత్రం పెంచారు. గత ఏడాది టికెట్ ధర రూ.10 ఉండగా..ఈ సారి దాన్ని ఏకంగా రూ.40కి పెంచారు. నుమాయిష్కు ప్రతి రోజు వేలాది మంది వచ్చే అవకాశముండటంతో భద్రతాపరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ..ఇప్పటికే ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని చర్యలు తీసుకుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్ట నిఘాను ఏర్పాటుచేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను, ప్రభుత్వ స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్లో సుమారు 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మామూలు రోజుల్లో అయితే ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుంది. అదే వీకెండ్స్, సెలవు దినాల్లో అయితే ఒక అరగంట ఎక్కువ సేపు తెరిచి ఉంచుతారు. అంటే రాత్రి 11 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుంది.
అంతేకాకుండా మహిళల కోసం ఒకరోజు, పిల్లల కోసం మరొకరోజు ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. జనవరి 9న లేడీస్ డే, అలాగే జనవరి 31న చిల్డ్రన్ స్పెషల్ పేరుతో ప్రత్యేక రోజు ఉంటుంది. లేడీస్ డే రోజు మహిళలకు, చిల్డ్రన్ స్పెషల్ రోజు పిల్లలకు ఉచిత ఎంట్రీ ఉంటుంది. అలాగే నుమాయిష్కు వచ్చే వారంతా కచ్చితంగా మాస్కులు పెట్టుకుని రావాలనే నిబంధనను పెట్టారు.
నుమాయిష్లో అనేక రాష్ట్రాలలో తయారయ్యే హ్యాండ్ మేడ్, రెడీ మేడ్ ఉత్పత్తులు అందుబాటులో ఉండడంతో.. రాబోయే రోజుల్లో భారీగా జనాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా అన్ని రకాల బట్టలు, కిచెన్ సామాగ్రి, దుప్పట్లు, బెడ్ షీట్లు, కర్టెన్స్, హ్యాండ్ మేడ్ డెకరేటివ్ ఐటెమ్స్, డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, బొమ్మలు ఇలా ఏం కావాలన్నా ఈ ఎగ్జిబిషన్లో దొరుకుతాయి.
ఈ ఏడాది సుమారు 22 లక్షల మంది నుమాయిష్ ఎగ్జిబిషన్కు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. దేశంలోనే కాకుండా తెలంగాణలో జేఎన్ 1 కేసులు ఎక్కువగా నమోదవడంతో ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే నుమాయిష్కు వచ్చేవారిని గోషా మహల్, అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ల వద్ద తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఈసారి కూడా సందర్శకుల కోసం నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE