మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చ్ 5, గురువారం నాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ముందుగా రెండ్రోజుల క్రితం జన్వాడలోని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫాంహౌస్పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డితో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 184,187, 11 రెడ్విత్ 5ఏ, ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారికీ నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. నోటీసులకు స్పందించకపోవడంతో ఈ కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఐదుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
[subscribe]