బిగ్బాస్-3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్పై మార్చ్ 4, బుధవారం రాత్రి హైదరాబాద్లోని ఓ పబ్బులో దాడి జరిగింది. పబ్బులో కొంతమంది యువకులు రాహుల్ తలపై బీరుసీసాలతో కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి బుధవారం రాత్రి 11.45 గంటలపుడు రాహుల్ సిప్లిగంజ్ పబ్బుకు వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో రాహుల్ వారిని నిలదీసిన క్రమంలో ఇరువర్గాలు మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, బంధువులు ఉన్నట్లుగా సమాచారం.
పబ్బులో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి రాహుల్ సిప్లిగంజ్ ఈ రోజు మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్ సమాధానం ఇచ్చారు. ముందుగా అవతలి వర్గం వారే తనపై అసభ్య పదజాలం ఉపయోగించారని, ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని రాహుల్ తెలిపారు. అలాగే ఈ దాడి ఘటనలో తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ కేసును విత్డ్రా చేసుకోనని వెల్లడించారు. రాజకీయ నేపధ్యం ఉండడం వలనే వాళ్లు రెచ్చిపోతూ దాడి చేశారని చెప్పారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు.
[subscribe]