యువత పాశ్చాత్య ధోరణిని వీడి సన్మార్గంలో నడవాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఒకరోజు నిర్వహించే యువజనోత్సవాలను మంత్రి శ్రీనివాస్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో కూడా యువత రాణించాలని చెప్పారు. తరచుగా క్రీడలు, సాంస్కృతిక పోటీలలో పాల్గొనడం వలన విద్యార్థులకు మానసిక వత్తిడుల నుండి ఉపశమనం లభిస్తుందని అన్నారు. మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, పాశ్చాత్య సంస్కృతి బారినపడి భవిష్యత్ ను అంధకారం చేసుకోవద్దని చెప్పారు.
మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవం, గుర్తింపు ఉందన్నారు. వాటిని ఆచరిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పోటీలలో ప్రతిభను చాటి మీ తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులనుద్దేశించి అన్నారు. విద్యారంగం, క్రీడారంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు గాను అన్నిజిల్లా కేంద్రాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువజనోత్సవాలలో భాగంగా బాలురు, బాలికలకు వేరువేరుగా సాంస్కృతిక పోటీలు, కబడ్డీ పోటీలను నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడ ఎంపికైన వారు ఈ నెల 9,10 తేదీలలో మహబూబ్ నగర్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారు 12 నుండి 16 వ తేదీ వరకు కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ లో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. పోటీలలో పాల్గొంటున్న విద్యార్ధినీ, విద్యార్ధులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి సుధాకర్ రావు, అర్జున అవార్డు గ్రహిత అనుకుమార్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE