ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న ఆయన తాజాగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ బహిరంగంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి అధిష్టానానికి విధేయుడిగా ఉన్నానని, అయితే తనపై నిఘా పెట్టారని, గత కొన్ని నెలలుగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో తనకు బదులు తన తమ్ముడికి టికెట్ ఇవ్వనున్నట్లు లీకులు ఇస్తున్నారని, ఇది తనను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన తమ్ముడికి పోటీగా తాను బరిలో ఉండనని, అవసరమైతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని ప్రకటించారు. అనుమానం ఉన్నచోట పనిచేయడం కష్టమని భావిస్తున్న ఆయన, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. తొలుత మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డితో బాలినేని భేటీ అయిన బాలినేని, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కోటంరెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోందని, ఆ పార్టీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని తెలిసిందని పేర్కొన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే వెళ్లిపోవచ్చని, ఆయనను బ్రతిమాలడం వంటివి చేయమని స్పష్టం చేశారు. ఒకవేళ కోటంరెడ్డి పార్టీని వీడితే, ఆయన స్థానంలో కొత్త ఇంఛార్జిని నియమిస్తామని తేల్చి చెప్పారు. వెళ్లేవారు వెళ్లకుండా ఫోన్ ట్యాపింగ్ అంటూ లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. పార్టీనుంచి ఎవరు వెళ్లినా ఎలాంటి నష్టం లేదని, సీఎం జగన్ చరిష్మాతో నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, ఇంకా పార్టీని వీడినందుకు భవిష్యత్తులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధపడే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE