న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన భారత్ 168 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీ (63 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్)తో చెలరేగాడు. ఇక భారత్ జట్టు నిర్దేశించిన 234 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో న్యూజిలాండ్ 66 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా న్యూజిలాండ్పై టీ20ల్లో భారత్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
ఇక భారత బ్యాట్స్మెన్స్ లో ప్రధానంగా శుభ్మన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్ హైలైట్. అతడు కేవలం 54 బంతుల్లో సెంచరీ సాధించాడంటే ఏ స్థాయిలో చెలరేగాడో అర్ధమవుతుంది. తొలి రెండు మ్యాచుల్లోనూ దారుణంగా విఫలమైన గిల్ ఈ మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 126 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు) కుర్రాజులో ఉన్నంతసేపు మెరుపులు నేర్పించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 24), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్తో 30 పరుగులు) రాణించి జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.
అనంతరం 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కివీస్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి కేవలం 66 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీసుకోగా.. ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, శివమ్ మావిలు తలా రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా న్యూజిలాండ్ టీమ్ లో డారిల్ మిచెల్ చేసిన 35 పరుగులే టాప్ స్కోర్ కావడం విశేషం. మిగిలినవారిలో మిచెల్ సాంట్నర్ 13 రన్స్ చేశాడు. మరే ఇతర న్యూజిలాండ్ బ్యాటర్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. తొలి ఓవర్ నుంచే ఆ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ లక్ష్యం దిశగా వెళ్లలేకపోయింది. చివరికి 12.1 ఓవర్లలోనే 66 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా 166 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
శుభ్మన్ గిల్ రికార్డు సెంచరీ..
ఈ ఫార్మాట్ లో శుభ్మన్ గిల్ తొలి సెంచరీ సాధించాడు. అంతేకాకుండా టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ఇండియన్గా చరిత్ర సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ కోహ్లీ, ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 61 బంతుల్లో చేసిన 122 పరుగులే ఇప్పటివరకు అత్యుత్తమం. అలాగే అన్ని ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన ఐదవ భారతీయుడు అయ్యాడు. తద్వారా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనా మరియు కేఎల్ రాహుల్ల సరసన చేరాడు. ఇక దీనికి ముందు న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఇంకా టీ20ల్లో సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సురేశ్ రైనాపేరిట ఉండేది. 2010లో దక్షిణాఫ్రికాపై 23 ఏళ్ల 156 రోజుల వయసులో 101 పరుగులు చేశాడు. కాగా రైనా కంటే కేవలం 10 రోజుల దూరంలో గిల్ ఈ మైలురాయిని 23 ఏళ్ల 146 రోజుల్లో సాధించాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE