తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమౌతున్న మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. తొలుత సచివాలయానికి చేరుకున్న సిఎం కేసీఆర్ చివరి దశకు చేరుకున్న ఎలివేషన్ పనులను, ఫౌంటేన్, గ్రీన్ లాన్, టూంబ్ నిర్మాణం దానికి తుది దశలో అమరుస్తున్న స్టోన్ డిజైన్ వర్కు తదితర పనుల పురోగతిని పరిశీలించారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా నిర్మించిన తీరును, భోపాల్ నుంచి ప్రత్యేకంగా వుడ్ కార్వింగ్ చేసి తెప్పించి అమర్చిన ద్వారాన్ని పరిశీలించిన సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సీఎం చాంబర్ వుండే ఆరవ అంతస్తుకు చేరుకున్నారు. సీఎం చాంబర్ లో ఏర్పాటు చేసిన టేబుల్లు, కుర్చీలు తదితర ఫర్నీచర్ ను సీఎం పరిశీలించారు.
గత పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన సూచనల మేరకు వాల్ క్లాడింగ్, డెకరేషన్ తదితర తుదిమెరుగులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లని రంగుతో కూడిన గోల్డ్ కలర్ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు, గోడల రంగుతో సరిపోయే విధంగా వేసిన మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన కారిడార్లు, అంతే అందంగా తీర్చిదిద్దిన చాంబర్ల ద్వారాల పనితీరును పరిశీలించి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను, వర్క్ ఏజెన్సీ అధికారులను సీఎం అభినందించారు. నిర్మాణం పూర్తయిన తరువాత అక్కడ చోటు చేసుకున్న గాలి, వెలుతురుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గమనించి సీఎం ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చాంబర్ లోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. సీఎంవో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన చాంబర్లను, అందులో అమరుస్తున్న ఫర్నీచర్ ను తిలకించారు. ఏర్పాట్లన్నీ సిబ్బంది పనికి అనుకూలంగా వుండే విధంగా వున్నాయా లేవా అని ఆరా తీసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్ ను, వారి సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను, కాన్ఫరెన్స్ హాల్ ను, సందర్శకుల కోసం వేచివుండే గదులను అందులోని సౌకర్యాలను సీఎం పరిశీలించారు. సమావేశాలు సహా, డైనింగ్ తదితర అవసరాలకోసం మల్టిపుల్ గా ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసిన విశాలవంతమైన హాల్ ను సీఎం పరిశీలించారు.
నలుమూలలా కలియతిరిగిన సీఎం కేసీఆర్ సీఎం కార్యదర్శులు, ఇతర సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. జీఏడి ప్రోటోకాల్ సిబ్బందికోసం ఏర్పాటు చేసిన చాంబర్లను సీఎం పరిశీలించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ లాంజ్, వీఐపీల వెయిటింగ్ లాంజ్ లను సీఎం పరిశీలించారు. మంత్రులకు కేటాయించిన శాఖలు అన్నీ వొక దగ్గర వుండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మంత్రికి చెందిన అన్ని శాఖల సిబ్బంది ఒకే చోట వుంటే బాగుంటదని సీఎం అన్నారు. ఆయా శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుకూలంగా కార్యాలయాలుండాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అనంతరం గ్రౌండు ఫ్లోర్ కు చేరుకున్న సీఎం, దక్షిణ భాగం గుండా నడుచుకుంటూ అక్కడ నిర్మాణంలో వున్న పార్కింగ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు సీఎం కొన్ని సూచనలు చేశారు.
అనంతరం సచివాలయం ప్రహారికి అంతర్గతంగా వున్న, బయట చుట్టూ నిర్మాణం చేస్తున్న రోడ్డు పరిసరాలను పరిశీలించారు. సచివాలయం ముందునుంచి, దక్షిణం నుంచి ఉత్తరం వైపు ట్యాంకుబండు మీదుగా వెళ్ళే మార్గాన్ని పరిశీలించారు. ఫ్లై ఓవర్ నుంచి, సచివాలయం ముందునుంచి నెక్లెస్ రోడ్డు దిశగా సాధారణ ప్రజలు ప్రయాణించేందుకు విశాలంగా నిర్మితమౌతున్న రోడ్లను సీఎం పరిశీలించారు. సెక్రటేరియట్ లోపలకు వెళ్ళే ప్రధానమార్గాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం సెక్రటేరియట్ చుట్టూ తిరిగి పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణ పనులు పూర్తికావచ్చినందుకు సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
సచివాలయం పరిశీలన తర్వాత నిర్మాణంలో వున్న డా.బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అక్కడ మొదటి అంతస్తుకు చేరుకున్న సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం బేస్ లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్ళను, ఆడియో విజువల్ ప్రదర్శనకోసం నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు, బయట ఫౌంటేన్, లాండ్ స్కేపింగ్ తదితర పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్ ను, వర్క్ ఏజెన్సీలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో ఏమాత్రం లోటు రావద్దని స్పష్టం చేశారు. చారిత్రకంగా నిర్మితమౌతున్న డా.బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
అక్కడినుంచి తెలంగాణ అమర వీరుల స్మారకార్ధం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం, లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతిని ఇంజనీర్లు మ్యాపుల ద్వారా సీఎంకు వివరించారు. పనుల గురించి సంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విప్ బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రోడ్లు భవనాలు శాఖ అధికారులు శ్రీనివాస్ రాజు, గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, తదితరులున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE