ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ ఏడాది జూలై నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నానికి తరలి వెళ్తున్నామని, అక్కడి నుంచే పాలనను కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రులతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు అంశంపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిపాలన వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రులు బలంగా తిప్పి కొట్టాలని, ప్రజలకు దీని గురించి అర్ధమయ్యేలా వివరించి చెప్పాలని సూచించారు. అలాగే గత మూడున్నరేళ్లుగా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, తద్వారా గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా ప్రజలకు మేలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
కాగా ఇప్పటికే విశాఖనే రాష్ట్ర రాజధాని అని గతంలో సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారిగా తాను విశాఖపట్నంకు మారనున్నట్టు ఆయన ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన విశాఖ నుంచే పాలన కొనసాగిస్తారన్న ఆసక్తి నెలకొంది. అయితే విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగిస్తానని అధికారికంగా కేబినెట్ సమావేశంలో ప్రస్తావించడం మాత్రం ఇదే ప్రథమం. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రులకు అప్పగించిన సీఎం జగన్, మంత్రులు సక్రమంగా పనిచేయకుంటే పదవుల నుంచి తప్పుకోవాలని హెచ్చరించారు. ఇక మొత్తం 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE