ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర, ఏపీకి మూడు రాజధానుల అంశాలపై ఆయన మరోసారి స్పందించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు పూనుకుందని, అయితే ప్రతిపక్షాలు దీనిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి సవరించిన మార్పులతో సరికొత్త రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. అలాగే చట్ట ప్రకారం మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. బిల్లు పెట్టిన తరువాత ఎప్పుడైనా సీఎం జగన్ విశాఖ రావొచ్చని, అలాగే అసెంబ్లీ సమావేశాల తరువాత భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన జరుగుతుందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.
విశాఖ అభివృద్దిని చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని, ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజిత ఏపీలో కానీ ఎలాంటి అభివృద్ధి జరుగలేదని మంత్రి అమర్నాథ్ అన్నారు. చంద్రబాబుకి అమరావతి అభివృద్ధిపై దృష్టి లేదని, ఆయన దృష్టి అంతా అక్కడి భూములపైనేనని తెలిపారు. అధికారంలో ఉండగా ఏనాడూ రైతులని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వారితో పాదయాత్రలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదని, అది విశాఖపై చేసే దండయాత్ర అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరని, తాను మంత్రిగానే కాకుండా ఇక్కడి సామాన్య పౌరుడిగా దీనిని వ్యతిరేకిస్తున్నానని ప్రకటించారు. ఈ పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఇప్పటికే పోలీసులు అభిప్రాయపడుతున్నారని, ఒకవేళ నిజంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ