జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నంలోని జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభా ప్రాంగణానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథమైన వారాహి తొలి అడుగును ఘనంగా ప్రారంభించి, విజయవంతంగా పూర్తి చేసిందని జనసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఆశేష జనవాహిని జయజయధ్వానాల మధ్య విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నంలో తలపెట్టిన పార్టీ 10వ ఆవిర్భావ సభా ప్రాంగణానికి వారాహి విజయ యాత్రను ప్రారంభించింది. జనసైనికులు, వీర మహిళలు పెద్దఎత్తున వెంట తరలిరాగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారాహిదారుడై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభకు బయలుదేరారు. వారాహి యాత్ర నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ మద్దతుగా రాష్ట్రం నలు మూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. వారాహి యాత్రకు తరలివచ్చిన జనఉప్పెన బెంజి సర్కిల్-పెనమలూరు మధ్య జాతీయ రహదారిని ముంచెత్తింది. సుమారు 8 కిలోమీటర్ల మేర ఇసుక వేస్తే రాలనంతగా రహదారి నిండిపోయింది. వీర మహిళలు హారతులు పట్టి ఆహ్వానం పలుకగా విజయవాడ ఆటోనగర్ గేట్ వద్ద నుంచి వారాహి యాత్ర ప్రారంభమయ్యింది. వేలాది బైకులు, వందలాది కార్లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారిని ముంచెత్తడంతో వారాహి విజయవాడ శివార్లకు చేరుకోవడానికే 3 గంటల సమయం పట్టింది. ఆటోనగర్, కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు సెంటర్లలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి పార్టీ శ్రేణులు భారీ గజమాలలతో స్వాగతం పలికారు. 65వ నంబర్ జాతీయ రహదారితో పాటు చుట్టు పక్కల ఉన్న అపార్ట్ మెంట్లు, భవనాలు, ఎత్తైన ప్రదేశాలన్నీ పవన్ కళ్యాణ్ ను చూసేందుకు వచ్చిన జనసందోహంతో నిండిపోయాయి” అని తెలిపారు.
“వేడిగాలులను సైతం లెక్క చేయకుండా తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. కొంత మంది జనసైనికులు స్థంభాల మీదకు ఎక్కి వారాహిపై ఉన్న పవన్ కళ్యాణ్ కి చెయ్యి ఇచ్చేందుకు ప్రయత్నించగా, తన చేతితో తాకి ఉత్సాహ పరిచారు. ప్రతి సభలో ముందు దేశం తర్వాతే పార్టీ అని చెప్పే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చిన జాతీయ జెండాని పలు మార్లు చేతబూని తన దేశభక్తిని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మద్దతుగా తరలివచ్చిన దళిత సోదరుల కోరిక మేరకు నీలి జెండా రెపరెపలాడించి జై భీమ్ అంటూ నినదించారు. జాతీయ పతాకం, నీలి జెండా తర్వాత పార్టీ జెండా చేతబూని అభిమానుల్ని ఉత్సాహ పరిచారు. ఆటో నగర్ నుంచి దారి పొడుగునా అభిమానులు పవన్ కళ్యాణ్ మీద పూల వర్షం కురిపించగా ఆ అభిమాన సంద్రంలో తడిసి ముద్దయ్యారు. జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథానికి పవిత్ర వారాహి మాత నామకరణం చేసిన నేపథ్యంలో దారి పొడుగునా వీర మహిళలు వారాహికి హారతులు పట్టగా, పార్టీ శ్రేణులు వారాహి స్పృశిస్తూ తరించారు. చాలా మంది వారాహిని ముట్టుకుని నమస్కరించడం కనబడింది. వారాహి యాత్ర సాగినంత దూరం రహదారికి ఇరు వైపులా మహిళలు హారతులు చేతబూని నిలబడ్డారు. పలువురు మేళతాళాలు, బాణసంచ పేలుళ్లతో వారాహి దారుడైన పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం పలికారు. ఆటో నగర్ నుంచి కొంత దూరం గబ్బర్ సింగ్ బ్యాచ్ వారాహి ముందు నడుస్తూ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచింది” అని పేర్కొన్నారు.
“ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు, ప్రజలు వెంట తరలిరాగా వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుండగా, మార్గ మధ్యంలో పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్ వాహనాల మధ్య ఇరుక్కుపోవడంతో, వారాహిని పది నిమిషాలు నిలిపివేసి అంబులెన్స్ కి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దారిచ్చారు. అంబులెన్స్ ముందుకు వెళ్లిపోయిన తర్వాత వారాహి యాత్ర కొనసాగింది. మానవతావాదిగా పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారాహి మీద సభా స్థలికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ తన కోసం వచ్చిన జనప్రవాహం మధ్య సుమారు 38 కిలోమీటర్లు 5 గంటల పాటు ప్రయాణించారు. పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తున్న వేలాది వాహనాలను నియంత్రించడం పోలీసుల వల్ల కాకపోవడం, సభకు ఆలస్యం కావడంతో జాతీయ రహదారి 65పై ఉన్న దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత వారాహి నుంచి దిగి కారు ఎక్కారు. అదే కారులో సభా స్థలికి చేరుకున్నారు. మార్గమధ్యంలో పామర్రు, గూడూరుల్లో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు రోడ్డుపై వేచి ఉండడంతో కారుపై నుంచి వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. వారాహి యాత్ర ఆద్యంతం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభ, వారాహి యాత్ర నేపధ్యంలో విజయవాడ-మచిలీపట్నం మధ్య 65వ నంబర్ జాతీయ రహదారి మొత్తం జనసేన జెండాలు, ఆహ్వానం పలుకుతూ వెలసిన భారీ హోర్డింగులు, స్వాగత తోరణాలతో నిండిపోయింది” అని జనసేన పార్టీ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE