యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లింలకు ఇచ్చే ఇఫ్తార్ విందును బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ముస్లిం మత పెద్దల వద్దకు వెళ్లి పేరు పేరునా పలుకరించి అభివాదాలు తెలియజేశారు. అలాగే ప్రసంగం అనంతరం ఇఫ్తార్కు హాజరైన ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు.
అజాన్ పిలుపు తర్వాత ఇస్లాం సాంప్రదాయ పద్ధతిని అనుసరించి తనతో పాటు ఆశీనులైన వారికి ఇఫ్తార్ విందును అందించి రోజాను విరమింపజేశారు. అనంతరం ముస్లిం ప్రముఖులతో కలిసి విందులో పాల్గొన్నారు. అంతకుముందు అనాథ పిల్లలతో కాసేపు ముచ్చటించిన సీఎం కేసీఆర్.. వారి యోగ క్షేమాలతోపాటు చదువు వివరాలను అడిగి తెలుసుకొన్నారు. వారి ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని ప్రశంసించిన ఆయన, వారు గొప్పగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పేదలకు రంజాన్ కానుకలను అందజేశారు.
ఇక సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడినట్టుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవాలని కోరారు. కొన్ని సందర్భాల్లో అనుకున్న పని కొంచెం ఆలస్యం అవుతుండవచ్చు కానీ గమ్యం చేరుకోవడం మాత్రం ఖాయం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మాదిరి పనిచేసి ఉంటే, దేశ జీడీపీ కనీసం మరో రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లు పెరిగేదని, కానీ దురదృష్టవశాత్తూ దేశం అగమ్యగోచర స్థితిలో పయనిస్తున్నదని చెప్పారు. భారతదేశం మనందరిదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం మన దేశాన్ని కాపాడుకోవాలని పెద్దలను, యువతను కోరుతున్నానని అన్నారు. ఈ దేశ గంగా జమున సంస్కృతిని, ఆచార సంప్రదాయాలను ఎవరూ మార్చలేరని, సమయం వచ్చినప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్రయోగించాలని తెలిపారు.
ఇక 9 ఏళ్ల క్రితం వెనుకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ నేడు అల్లా దయతో, మీ అందరి ప్రార్థనలతో అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, దేశంలో మరే రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115 ఉన్నదని, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్దపెద్ద రాష్ట్రాలకంటే మనం ముందంజలో ఉన్నామని సీఎం కేసీఆర్ తెలియజేశారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తలసరి విద్యుత్తు వినియోగం 1,000-1,050 యూనిట్లు ఉండేది. నేడు అది 2,100 యూనిట్లకు పెరిగిందని, పరిశ్రమలు, ఐటీ రంగంలో గణనీయ పురోగతి సాధించిందని వెల్లడించారు. ఒవైసీ తదితరులు కోరినట్టుగానే అనీస్ ఉల్ గుర్బాను అత్యద్భుతంగా నిర్మించుకొన్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో రూ.12,000 కోట్లను ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చుచేసిందని తెలిపారు.
ఇక ఇఫ్తార్కు దాదాపు 12 వేల మందికిపైగా ముస్లింలు హాజరయ్యారు. సీఎం కేసీఆర్కు మైనార్టీస్ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, మైనార్టీస్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్లు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు హాజరయ్యారు. ఇంకా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, టెన్న్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE