టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. కాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో చంద్రబాబు మూడురోజులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం గుడివాడ పట్టణంలో జరిగే ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. దీనికి ముందు నిమ్మకూరులో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొననున్నారు. కాగా నిన్నమాజీ మంత్రి పేర్ని నాని అడ్డాలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు.. ఈరోజు మరో మాజీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడకు వస్తుండటం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇక కొడాలి నాని తరచుగా టీడీపీ పైనా.. అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పైనా చెలరేగి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో.. ఈసారి ఆయనను గుడివాడలో ఓడించాలని టీడీపీ గట్టి పట్టుదలగా ఉంది.
దీంతో నేటి అధినేత పర్యటనను విజయవంతం చేయడానికి కృతనిశ్చయంతో ఉంది. ఇక నిమ్మకూరు నుంచి బస్ స్టాండ్ సెంటర్, నెహ్రూ చౌక్, గుడివాడ బైపాస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో సాగుతుంది. అనంతరం గుడివాడలోని వీకేఆర్, కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి చంద్రబాబు పర్యటనలో పాల్గొనాలని ఇప్పటికే ముఖ్యనాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు? దీనిపై కొడాలి నాని ఎలా స్పందిస్తారు? అని రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్సుకత నెలకొంది. కాగా నిన్న చంద్రబాబుకు స్వాగతం చెప్పే ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హడావుడి చేశారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న ఫోటోలతో పెనమాలూరు, గూడూరులలో చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎన్టీఆర్ అభిమానులు హల్చల్ చేయడం గమనార్హం.
ఇక మచిలీపట్నం పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అవినీతిలో దూసుకుపోతోందని, జగన్ దేశంలోనే నెంబర్ వన్ ధనిక సీఎం అని డేటా వచ్చిందని తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆయన ధనికుడు అవుతున్నారన్నారని, అలాంటి వ్యక్తి పేదల ప్రతినిధి ఎలా అవుతారని ప్రశ్నించారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారంటే ప్రజలు ఎలా నమ్ముతారని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని సీఎం జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వైనాట్ కుప్పం అని జగన్ వైసీపీ నేతలతో అంటున్నారని, అయితే ఆయన సొంత అడ్డా అయిన పులివెందులలోనే గెలిచి చూపించామని, మొన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఓటు వేసి సత్తా చూపించారని వ్యాఖ్యానించారు. ఈసారి ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, దీనిని సీఎం జగన్ అడ్డుకోలేరని చంద్రబాబు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE