ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆర్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ఏపీ లోని ప్రస్తుత పరిస్థితులపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులకు, తెలంగాణలోని పరిస్థితులకు తేడా తెలుసుకోవాలని.. తెలంగాణకు ఏపీ ఏ విధంగానూ పోటీయే కాదని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని, అందుకే వారు ఏపీలో ఓటు హక్కు వదులుకుని తెలంగాణలోనే పెట్టుకోండి అని కార్మికులకు సూచించారు.
దీనిపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు బుధవారం స్పందించారు. ‘మంత్రి హరీష్ రావు ఏపీకి వస్తే.. ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. తెలంగాణలో స్కూళ్ళు, ఏపీలో స్కూళ్ళు, అక్కడి సంక్షేమ పథకాలు, ఇక్కడ అమలు చేస్తున్న పథకాల మధ్య తేడా తెలుస్తుంది. జీడీపీలో దేశంలోనే ఏపీ నం.1 స్థానంలో ఉంది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి ముందు తెలుసుకుని మాట్లాడాలి. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే అప్పుల పాలు చేశారు. వర్షం వస్తే హైదరాబాద్ నగరంలో నీళ్లు ఇళ్ళపైనుంచి ప్రవహిస్తాయి. ముందు మీ రాష్ట్రం గురించి చూసుకోండి. మీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పండి’ అని మండిపడ్డారు.
ఇక మంత్రి కారుమూరి వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి కౌంటర్ ఇచ్చారు. ‘నేను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఏమున్నది? అని అంటున్నారు. మా దగ్గర ఉన్నవి చెప్పమంటే దునియా చెబుతాం. మా దగ్గర 56 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించుకున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి అమలు చేస్తున్నాం. త్యాగాల పునాదులు మీద ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ క్షేమం కోసమే పనిచేస్తుంది. హైదరాబాద్లో ఉంటున్న ఏపీ వాసులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. రెండు ఓట్లు ఉంటే హైదరాబాద్లో ఉంచుకోవాలని చెప్పాను. అందులో తప్పేముంది?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘నాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నారు. ఇప్పుడేమో ఆ ఊసే ఎత్తడం లేదు. హోదా అంశాన్ని కేంద్రం పక్కన పెట్టినా పట్టించుకోరు, తిరిగి ప్రశ్నించరు. ఇక విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలో ఉన్న వాళ్లు అడగరు.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మినా ఎవ్వరు నోరెత్తరు. అక్కడి పార్టీలు, నేతలు వారి ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయి. ప్రజలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిది’ అని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE