రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తమ నిరసనలో పాల్గొని మద్దతు తెలుపాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను వారు ఆహ్వానించారు. ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, రవి దహియా మరియు సాక్షి మాలిక్ సహా పలువురు భారతీయ రెజ్లర్లు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తమను తప్పుదోవ పట్టించారని, అయితే ఈసారి మాత్రం ఎవర్నీ గుడ్డిగా నమ్మేది లేదని అన్నారు. తమ నిరసనకు మద్దతు ఇవ్వాలనుకునే వారు ఎవరైనా సరే తమతో చేరడానికి స్వాగతం పలుకుతామని, అది బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లేదా మరేదైనా పార్టీ కానీ.. అందరినీ ఆహ్వానిస్తామని తెలిపారు. ఈసారి చేపడుతున్న నిరసన ప్రదర్శనకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని, కానీ తాము మాత్రం ఏ పార్టీకి అనుబంధం కాదని స్పష్టం చేశారు.
ఇక జనవరిలో జరిగిన నిరసన సందర్భంగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నాయకురాలు బృందా కారత్ రెజ్లర్ల నిరసనలో పాల్గొని వారికి మద్దతు తెలుపడానికి వచ్చారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయాలని తాము భావించట్లేదని, రాజకీయ నాయకుల మద్దతు తమకు అవసరం లేదని, కావున వేదిక దిగి వెళ్లిపోవాల్సిందిగా ఆమెను రెజ్లర్లు కోరారు. అనంతరం కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ను కలిసిన తర్వాత జనవరిలో తమ నిరసనను ముగించేందుకు రెజ్లర్లు అంగీకరించారు. రెజ్లర్ల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ నియమించింది. అయితే కమిటీ సహా ప్రభుత్వం తమకు అనేక హామీలు ఇచ్చినా, ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తూ.. రెజ్లర్లు ఆదివారం నుంచి మరోసారి దీక్ష చేపట్టారు.
కాగా ఈ ఏడాది ఆరంభంలో తొలిసారి నిరసన చేపట్టిన రెజ్లర్లు ప్రభుత్వ హామీతో అప్పుడు తమ ఆందోళనను విరమించిన విషయం తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ హోదాలో బ్రిజ్ భూషణ్ ఒక మైనర్తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లను వేధించాడని, దుర్భాషలాడాడని రెజ్లర్లు ఆరోపిస్తూ ఆయనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కన్నాట్ ప్లేస్ పోలీసు స్టేషన్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర క్రీడాశాఖ ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టు కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రమంలో అంతకుముందు, డబ్ల్యుఎఫ్ఐ చీఫ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ (డిసిడబ్ల్యు) చీఫ్ స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ