టీఎస్ ఐపాస్ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దీనిద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులను కేవలం 21 రోజుల్లో ఇస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ యూనిట్కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావుతో పాటు పలువురు స్థానిక నాయకులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి రూ. 1000 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్లో యూనిట్ పెట్టడం గొప్ప విషయమని, ఇలాంటి పరిశ్రమల్లో ఉపాధి పొందేందుకు వీలుగా జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో కొత్తగా వచ్చే కంపెనీలలో స్థానిక యువతకు పెద్దపీట వేస్తున్నామని, అయితే ఉద్యోగాలు రావాలంటే యువత కూడా తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఇక భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అన్న మంత్రి కేటీఆర్.. దీనిని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ఆర్టీసీతో పాటు ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని, దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి సంబంధించిన అన్ని రకాల పార్ట్లు ఇక్కడే తయారయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ అడ్డాగా మారాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. కాగా తెలంగాణ వచ్చిన తర్వాత 23 వేల పరిశ్రమలు తీసుకొచ్చామని, తద్వారా రాష్ట్రానికి రూ.3 లక్షల 30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అలాగే వీటి వలన సుమారు 20లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ