ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకినా జాబితాలో బ్రిటన్ ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ , ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్కాక్ కూడా చేరారు. బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్కు కరోనా సోకడంతో 10 డౌనింగ్ స్ట్రీట్లో తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయినట్టుగా ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అలాగే దేశ ప్రధానిగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షిస్తానని ఆయన వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని కరోనా బారిన పడిన నేపధ్యంలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ (బ్రిటన్ ఫైనాన్స్ మినిస్టర్), ప్రీతి పటేల్ (బ్రిటన్ హోమ్ మినిస్టర్) లు ఆ దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ప్రిన్స్ చార్లెస్, బొరిస్ జాన్సన్ కలిసి నిర్ణయించుకుని ఈ బాధ్యతలు వీరిద్దరికి అప్పగించినట్టుగా తెలుస్తుంది. మరో వైపు బోరిస్ కనుక తీవ్ర అనారోగ్యానికి గురైతే బ్రిటన్ మొదటి కార్యదర్శి డొమినిక్ రాబ్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.