కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 30 , సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ అమలు జరుగుతున్న విధానం, నిత్యావసర సరుకులు సరఫరా, రేషన్ సరఫరా ఇతర పలు కీలక అంశాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాగా ఏపీలో ఇప్పటివరకూ 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు మార్చ్ 29, ఆదివారం నాడు కూడా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభుత్వ చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలో మరింత పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇకపై పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కోసం ఉదయం 6 నుండి 11 వరకే అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. గ్రామాల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకూ అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శన, అందులోనే ఫిర్యాదు కోసం కాల్ సెంటర్ నంబర్ ఉండాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే జైలు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కరోనా విస్తరిస్తున్న అర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.