గత మూడురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో అసోంలో పరిస్థితి ప్రమాదస్థాయికి చేరుకుంది. నదులు, వాగులు, చెరువులు పొంగిపోవడంతో లోతట్టులో ఉన్న ప్రాంతాలు, గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇప్పటికే అసోంలో వరదల వలన మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. అసోంలోని 17 జిల్లాల్లో సుమారు 28 లక్షల మంది పై వరదలు ప్రభావం చూపుతున్నాయి. కాజీరంగా నేషనల్ పార్క్ మొత్తం నీటితో నిండిపోయింది, ఇప్పటికే 200 పైగా వన్య ప్రాణులు మృత్యువాతపడ్డాయి. పార్కుల్లోకి నీరు చేరడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు వన్య ప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. భారీ వర్షపాతం కారణంగా, అనేక వేల మంది నిరాశ్రయులయ్యారు.
మరో వైపు ముంబయితో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షపాతం నమోదయింది. వర్షాల వలన ఇప్పటికే పలు విమాన సర్వీసులను నిలిపివేసారు, పలు రైళ్లను కూడ రద్దు చేసారు. మరో 48 గంటల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయగడ్, రత్నగిరి ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలకోసం,వాతావరణ విభాగం ఆరంజ్ అలర్ట్ ను ప్రకటించింది. జూలై నెల మొదటివారంలో కూడ కుండపోత వర్షాలతో ముంబయి అతలాకుతలం అయింది. వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచనలు చేస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=xWu-avLiIyQ]