తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చ్ 29, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాలు, పోర్టులన్నీ రద్దు చేయడంతో విదేశాల నుంచి దేశానికి రాకపోకలు పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంలో కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇతర కొత్త కేసులు నమోదు కాకపోతే ఏప్రిల్ 7 తర్వాత కరోనా బాధితులు ఉండే అవకాశం చాలా తక్కువని అన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో కూడా 11మంది కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని చెప్పారు. మిగతా 58 మంది పరిస్థితి నిలకడగా ఉందని, వారిని కూడా పరీక్షల అనంతరం పరిస్థితులను బట్టి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- కరోనా సోకినా 70 మందిలో 11 మంది కోలుకున్నారు.
- ఏప్రిల్ 7 వ తేదీతో పర్యవేక్షణలో ఉన్న వారి 14 రోజుల క్వారంటైన్ కాలం ముగుస్తుంది.
- మనదేశం కరోనాను ఎదురుకున్న తీరును అంతర్జాతీయ సమాజం మెచ్చుకుంటుంది. ప్రజలు లాక్ డౌన్ ను మరింత శ్రద్దగా పాటించాలి.
- సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు.
- ఇతర రాష్ట్రాల కార్మికులకు 12 కిలోల బియ్యం, నెలకు రూ.500 అందజేస్తాం.
- వరి, మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు.
- పౌర సరఫరాల శాఖకు రూ. 25 వేల కోట్లు, మార్కెఫెడ్ కు రూ. 3 వేల కోట్లు.
- రాష్ట్రంలో రైతులు సామాజిక దూరం పాటిస్తూ, తమకిచ్చే పాసుల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలి.
- వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు గ్రామాల్లోనే ధ్యాన్యాన్ని సేకరిస్తారు.
- కర్ఫ్యూ, లాక్డౌన్ ఉన్నంతకాలం ప్రజలంతా స్వీయనిర్భందంలో ఉండాలి.
[subscribe]