నందమూరి తారక రామారావు ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న కార్యక్రమం జరిగినా..లేదా మిగతా కుటుంబ సభ్యులు ఏదొక కార్యక్రమం ద్వారా వార్తల్లోకి ఎక్కినా వెంటనే తారక్ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారిన చంద్రబాబు ఎపిసోడ్లో.. జూనియర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారనే ప్రశ్నలు, అనుమానాలే వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే..సెప్టెంబర్ 9 నుంచి చంద్రబాబు కుటుంబం మొత్తం బ్రాహ్మిణితో సహా రోడ్డు మీదే ఉన్నారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపేవరకూ భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణికి సంఘీభావంగా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా వెళ్లారు. బాలకృష్ణ, రామకృష్ణతో పాటు చాలామంది బంధువులు బాసటగా నిలబడ్డారు. అయితే… ఇంత జరుగుతున్నా.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఎక్కడా నోరు మెదపలేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే మామయ్య అరెస్ట్ అయితే చూడటానికి రాకపోయినా కనీసం చిన్న స్టేట్మెంట్ ఇచ్చేంత కూడా టైమ్ లేదా అని టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పైగా షూటింగ్ కూడా హైదరాబాద్లోనే జరుగుతుంది కదా అయినా తారక్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ప్రశ్నిస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో కూడా జూనియర్ తీరు ఇలాగే ఉంది. ఆమధ్య ఢిల్లీలో నందమూరి తారకరామారావు స్మారకంగా ఎన్టీఆర్ బొమ్మతో రూ. 100 నాణేన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఒక్క ఎన్టీఆర్ తప్ప అంతా హాజరయ్యారు. తాతే నా ప్రాణం అంటూ పదేపదే చెప్పే తారక్.. ఎందుకు వెళ్లలేదంటూ మీడియా వర్గాలు కూడా ప్రశ్నించాయి.
దీంతో సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు జూనియర్ కావాలనే దూరంగా ఉంటున్నారా..? లేక చంద్రబాబు నాయుడు హాజరవుతున్న కార్యక్రమాలకు మాత్రమే వెళ్లడం లేదా అన్న కొత్త అనుమానాలు వినిపించాయి. ఎందుకంటే ఒకప్పుడు మామయ్య చంద్రబాబు కోసం స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తారక్.. ఆ తర్వాత వచ్చిన విభేదాలతో చంద్రబాబుతో కలిసి ఏ ఒక్క కార్యక్రమంలో కూడా కనిపించలేదు. దీంతో చంద్రబాబుకు కావాలనే జూనియర్ దూరంగా ఉంటున్నారన్న వాదన వినిపించేది.
కొన్నేళ్లుగా చంద్రబాబుకు, టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు తారక్. మాటవరుసకు కూడా చంద్రబాబుతో కలిసి డయాస్ షేర్ చేసుకున్న సందర్భాలు కనిపించలేదు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయాక..టీడీపీకి జూనియర్కు గ్యాప్ పెరిగిపోయింది. మామా అల్లుళ్ల మధ్య కూడా మరింత దూరం పెరిగిందే తప్ప..ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. ఆ మధ్య తన అక్క సుహాసిని ఇంట్లో జరిగిన పెళ్లి కార్యక్రమానికి తారక్తో పాటు చంద్రబాబు కూడా వెళ్లారు కానీ అక్కడ కూడా మాటల్లేవని.. మీడియా కోడై కూసింది.
అంతేకాదు గతంలో..ఏపీ అసెంబ్లీలో మేనత్త భువనేశ్వరిని అవమానిస్తూ ఏపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా జూనియర్ రియాక్షన్పై టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఎక్కడ కూడా భువనేశ్వరి గురించి మాట్లాడకుండా జనరలైజ్ చేసి ఇచ్చిన స్టేట్మెంట్ గురించి నెట్టింట్లో పెద్ద చర్చలే జరిగాయి. అయితే బంధువుల మధ్య విభేదాలు రావడం కామనే కానీ.. కష్టం వచ్చినప్పుడు కూడా తారక్ ఇంత మొండిగా ఉండటం కరెక్ట్ కాదంటూ ఇప్పుడు చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు చిన్నప్పటి నుంచీ ఎన్టీఆర్ కుటుంబం నుంచి తారక్కు ఎన్నో అవమానాలు ఎదురవడంతోనే ఇలా బిహేవ్ చేస్తున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హీరోగా నిలదొక్కుకునేవరకూ అన్నీ అవమానాలే పడ్డాడని. మధ్యలో కాస్త కలుపుకొని తిరిగినట్లు తిరిగినా హరికృష్ణ చనిపోయాక అదీ దూరం అయిపోయిందని గుర్తు చేస్తున్నారు. బాలకృష్ణ కూడా కనీస మర్యాద ఇవ్వకుండా ఎన్నో సార్లు అవమానించారని అంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు జూనియర్కు ఆహ్వానం కూడా పంపలేదని.. ప్రచారంలో పాల్గొని ఎంతో సాయం చేసిన తారక్ను.. అధికారం వచ్చాక చంద్రబాబు పక్కన పెట్టేశారన్న వార్తలు వినిపించాయని అంటున్నారు. ఇలా పదే పదే అవమానాలు పడ్డ ఎన్టీఆర్.. తర్వాత ఆ కుటుంబానికి దూరంగా ఉండటం మొదలుపెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE