తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7, మంగళవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో మరో రెండు హెల్ప్లైన్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణ, ప్రజల మానసిక ఆరోగ్యం కోసం కొత్తగా మరో రెండు హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. ఈ హెల్ప్లైన్స్ ఉపయోగించుకుని వీడియోకాల్ లేదా వాట్సాప్ ద్వారా వైద్య సంబంధిత సమాచారం, సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ హెల్ప్లైన్స్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
కరోనా వైరస్ కు సంబంధించి వైద్య సహాయం, సమాచారాన్ని కోవిడ్ టెలీ మెడిసిన్ హెల్ప్లైన్ నంబర్ 83318 65100కు సంప్రదించాలని కోరారు. అలాగే ఇతర దురలవాట్లు, మానసిక రుగ్మతలకు బాధపడుతున్న వారికీ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఆరుగురు మానసిక వైద్య నిపుణులతో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సైకియాట్రిక్ హెల్ప్లైన్ 1800 4254731 అందుబాటులో ఉంటుందని, ఈ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.