కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్డౌన్ పొడిగింపు అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ పొడగించాలని పలు రాష్ట్రాలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు వస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మేధావులతో మాట్లాడుతున్నారని తెలిపారు. అలాగే లాక్డౌన్ పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారని చెప్పారు.
ప్రజలంతా లాక్డౌన్ కు సహకరించాలని, లాక్డౌన్ ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అనవసరమైన కారణాలతో రోడ్డుపై తిరగొద్దని సూచించారు. వారానికి సరిపడా సరుకులను దగ్గర పెట్టువాలని ప్రజలకు సూచించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆహార కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గత ఆరేళ్లలో కేంద్రం ఒక్క రూపాయిని కూడా వృధా చేయలేదని, ఈ సమయంలో ప్రతిపక్షాల సలహాలను కూడా స్వీకరిస్తామని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
[subscribe]