తెలంగాణలో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. 64 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది.. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదే ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ఇప్పటి నుంచే టి.కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పదికి పైగా స్థానాలను దక్కించుకొని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తమవంతు సహాయసహకారాలు అందివ్వాలని టి.కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
అయితే ఈసారి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని టి.కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కొద్దిరోజులుగా ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి లేదా మల్కాజ్గిరి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని.. వచ్చే ఎన్నికల్లో కూడా తానే అక్కడి నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. తాను టికెట్ అడిగితే కాదనే వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు.
ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరినట్లు రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఖమ్మం నుంచి పోటీ చేయాలా వద్దా అనే దానిపై సోనియా గాంధీ కసరత్తు చేస్తున్నారన్నారు. సోనియా గాంధీ ఒకవేళ ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోతే.. తానే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. తాను కాకుండా మరెవరూ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ తన నిర్ణయం వెల్లడించే వరకు ఓపికతో ఉండాలని రేణుకా చౌదరి కేడర్కు సూచించారు.
ఇక తెలంగాణలో నిరుద్యోగ సమస్యపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని రేణుకా చౌదరి వెల్లడించారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభించిందని.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేసి తీరుతామని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY