ఎన్నికల మేనిఫేస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరచూ చెప్పే ఏపీ సీఎం జగన్.. దానిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 18 న రాయలసీమలో వైసీపీ మేనిఫేస్టోను విడుదల చేయనున్నారు. ఈనెల 18న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభలోనే జగన్ మేనిఫేస్టోను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.ఇప్పటికే టీడీపీ తొలి విడత మేనిఫేస్టో విడుదల చేయడంతో..ఇప్పుడు జగన్ మేనిఫేస్టోలో ఏఏ అంశాలుంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చంద్రబాబు తన తొలి విడత మేనిఫేస్టోను సూపర్ సిక్స్ పేరుతో విడుదల చేసి.. ఆరు గ్యారంటీలను ప్రజల ముందుంచారు. మహిళలు, యూత్, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ మేనిఫేస్టోను విడుదల చేశారు. అంతేకాకుండా మలి విడత మరో మేనిఫేస్టో ప్రకటన కూడా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. పొత్తులతో ఉన్న భాగస్వామ్య పార్టీలతో కలిసి చంద్రబాబు రెండో విడత మేనిఫేస్టోను అతి త్వరలో విడుదల చేయనున్నారు.
2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశామని చెప్పే సీఎం జగన్ ఈసారి ఎన్ని హామీలను ప్రజల ముందుకు తీసుకువస్తారోనని అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ. 2.50 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారులకు అందజేశామని చెబుతున్న జగన్ గవర్నమెంట్.. ఈ ఎన్నికల కోసం మహిళలు, రైతులు, ఉద్యోగులను లక్ష్యంగా మేనిఫేస్టోను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు లక్షల వరకూ రైతు రుణ మాఫీతో పాటు..ఉద్యోగులకు కూడా జగన్ వరాలను ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే సామాజికవర్గాల వారీగా అందరినీ ఆకట్టుకునే విధంగా మేనిఫేస్టో ఉండే ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీసీ మంత్రం జపిస్తున్న వైసీపీ..తమ మేనిఫేస్టోలో కూడా వారికే అగ్రస్థానం కల్పిస్తూ అనేక హామీలను ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మేనిఫేస్టో ఒక పేజీ కంటే ఎక్కువ ఉండకూడదని సీఎం జగన్ ఆదేశించడంతో.. ఒక టీం మాత్రం దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ మేనిఫేస్టో కోసం ఇటు రాజకీయ పార్టీలే కాదు ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ