మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. దీంతో నరసరావుపేట పార్లమెంట్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. వైసీపీలో హేమాహేమీలుగా పేరుబడ్డ కొంతమంది నాయకులు ఇప్పటికే టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో.. అధికార వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వైసీపీ నుంచి బయటకు వచ్చిన నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ నెల 22న టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలుకు టీడీపీ నుంచి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసారు. దీంతో దేవరాయలు ఫిబ్రవరి 22న పసుపు కండువా కప్పుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు పల్నాడులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనే బహిరంగ సభలోనే లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ కండువా కప్పుకుంటారన్న టాక్ నడుస్తోంది. కానీ ఆ ఇద్దరి అధినేతల ప్రోగ్రామ్ ఎప్పుడనేది రెండు రోజుల్లో తెలియనుండంతో క్లారిటీ వచ్చాకే శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ మార్పు తేదీని ఫైనల్ చేయడానికి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది .
శ్రీకృష్ణ దేవరాయలుకు ఎంపీగా, వివాదరహితుడిగా పేరు ఉండటంతో పాటు అవినీతి మచ్చలేని నేతగానూ మంచి పేరు ఉంది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో తనకంటూ ఓ సొంత వర్గాన్ని కూడగట్టుకున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో రాజకీయ ముఖచిత్రాలు పూర్తిగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శ్రీకృష్ణ దేవరాయలుతో పాటు పల్నాడులోని గురజాల సెగ్మెంట్కు చెందిన వైసీపీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి కూడా తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు. జంగా గురజాల టికెట్ ఆశించినా… వైసీపీ అధిష్టానం దీనిని పట్టించుకోకపోవడంతో పాటు ఎంపీ టికెట్ను అదే బీసీ సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చింది. దీంతో షాక్ అయిన జంగా కృష్ణమూర్తి వైసీపీపై అసంతృప్త రాగం ఎత్తుకుని.. త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు.
జంగా కృష్ణమూర్తి వైసీపీలో బీసీ విభాగం అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఏపీలోని బీసీ సంఘం నేతలతో జంగా కృష్ణమూర్తికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో జంగా.. టీడీపీలో చేరితే గురజాల రాజకీయాలు మారనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కేన మల్లిఖార్జునరావు కూడా శ్రీ కృష్ణ దేవరాయలుతో కలిసి టీడీపీలో చేరనున్నారు.
ఇప్పటికే మక్కేన మల్లిఖార్జునరావు వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. వినుకొండ ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మనాయుడు ఓడించాలన్న పట్టుదలతో మల్లిఖార్జునరావు ఉన్నారు. వీరిద్దరితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది శ్రీ కృష్ణ దేవరాయలుతో పాటు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీరందరూ చేరే వేదిక టీడీపీ కేంద్ర కార్యాలయమా లేక ,పల్నాడు లో చంద్రబాబు,జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్న బహిరంగ సభ అన్నది మాత్రమే ఇప్పుడు తేలాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ