జూన్ 12 బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నాలుగోసారి.. రాష్ట్రం విడిపోయాక రెండో సారి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పటి వరకూ అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ దీక్షలు చేస్తున్న అక్కడి రైతులు తమ దీక్షలను విరమించారు. అమరావతికి పునర్వైభవం వచ్చే పరిస్థితి తిరిగి రావడంతో వెలగపూడిలో దీక్షా శిబిరాలను తొలగించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులు అని ప్రకటన చేయటం అప్పటికీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాని విషయంగానే మారింది. ఈ ప్రకటనతో 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని కోసం 30 వేల ఎకరాలను ఇచ్చిన అమరావతి రైతులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా 16వందల31 రోజులు పాటు రైతులు దీక్షలు చేశారు.
అయినా అమరావతి రైతుల దీక్షలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే తాజాగా జరిగిన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఘోరమైన ఓటమిని చవి చూసింది. ఇదే ఎన్నికలలో కూటమి భారీ మెజార్టీని సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం తాము అమరావతిని ఏకైక రాజధాని అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావటంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇక అమరావతి ఒక్కటే రాజధాని అంటూ ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగానే.. వెలగపూడిలో ఇప్పటి వరకూ ఏర్పాటు చేసిన తమ దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్లు అమరావతి రైతులు ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకం తమకు ఉందంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE