తెలంగాణ ప్రభుత్వం జూన్ 9 న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రిజల్ట్ గురించి అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ ఇమేజింగ్ షీట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అతి త్వరలో గ్రూప్-1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ను రిలీజ్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్కు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే విషయంపై అభ్యర్థుల్లో ఇప్పటికే టెన్షన్ నెలకొంది. మెయిన్స్కు 1:50 నిష్పత్రిలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అభ్యర్ధులు మాత్రం 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ విషయంపై హైదరాబాద్లో కొంతమంది అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో టీజీపీఎస్సీ మెయిన్స్కు క్యాండిడేట్స్ను 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంటుందని, అందుకే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేయాలనే విషయం గురించి ప్రభుత్వం అధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గ్రూప్ 1 ఫలితాలను ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా రిలీజ్ చేయాలని టీజీపీఎస్సీ ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. జులై మొదటి వారంలోనే గ్రూప్ 1 పరీక్షా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి మెయిన్స్ను ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారనేదే ఉత్కంఠగా మారింది. ఈ పరీక్షకు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే తెలంగాణలో గ్రూప్-1 పరీక్షను రెండు సార్లు వాయిదా వేసి జూన్ 9న మూడోసారి పరీక్ష నిర్వహించారు. గతంలో ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీకవడంతో తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు జరిగిన విషయం తెలిసిందే.
మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల కాగానే మెయిన్స్ పరీక్షను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మెయిన్స్ పరీక్షలో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. ఈ ఎగ్జామ్లో ప్రతి పేపర్కు 150 మార్కులకు నిర్వహించే మెయిన్ పరీక్షలను.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE