తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని, దీంతో త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. పీసీసీ పదవి ఆశించి భంగపడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, పలు సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు, మాట్లాడిన విధానం చూసినవారు కూడా ఇది నిజమేనని భావించారు. ఇక దీనికితోడు ఎంపీ సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరడంతో ఈ తరహా వార్తలకు బలం చేకూరింది. అలాగే ఎంపీ కోమటిరెడ్డి పార్టీ సమావేశాలకు రాకపోవడం, పార్టీతో ఎడమొహం పెడమొహంగా ఉండడంతో త్వరలో ఆయన పార్టీ మారతారని, లేదంటే కొత్త పార్టీ పెట్టనున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో.. గురువారం దీనిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, తనకు అసలు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. తన ముందు వేరే ఆప్షన్స్ లేవని, ఒకవేళ పార్టీ మారాలని నిర్ణయించుకుంటే అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. ఇక తనలో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోందని చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి.. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నానని, అలాగే రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్లో చేసిన దీక్షకు వచ్చి మద్దతు తెలిపానని చెప్పారు. నిరాధారమైన వార్తలతో కాంగ్రెస్ పార్టీని, తనను నమ్ముకున్న వారిని అయోమయంలో పడేయవద్దని, పార్టీ మారేవాడినే అయితే.. తనకు పీసీపీ పదవి ఇవ్వనప్పుడే పార్టీ మారేవాడినని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీ అధిష్టానంపై కొన్ని కామెంట్లు చేసిన మాట వాస్తవమేనని.. అయితే సోనియా, రాహుల్ గాంధీలతో చర్చల తర్వాత మనసు మార్చుకున్నానని, తన సేవల్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటామని వారు చెప్పారని ఎంపీ కోమటిరెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE