వైసీపీ మాజీ మంత్రి, మొన్నటి వరకూ పార్టీలో కీ రోల్ ప్లే చేసిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యవహారం తాజాగా దుమారాన్ని రేపుతోంది. అంబటి రాంబాబు ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణతో కలిసి గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మురళీ కృష్ణతో ఓ కంపెనీని పెట్టించి గుంటూరులోని బజరంగ్ జుట్టు మిల్లు స్థలాన్ని మెల్లమెల్లగా సొంతం చేసుకున్నారు.
అయితే ఆ స్థలం తీసుకోవడం వెనక ఉన్న డీలింగ్స్ ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ ఆ జూట్ మిల్ వల్ల అప్పట్లో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందేవారు. ఆ మిల్లు మూతపడగా..ఆ బిల్డింగ్ ప్లేస్లో రియల్ ఎస్టేట్ పేరుతో ఇప్పుడు బిల్డింగులు కడుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని పొన్నూరు నుంచి .. గతంలో మురళీకృష్ణ కూడా ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా మంత్రి హోదాలో ఉన్న అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
అంతేకాకుండా అంబటి మురళీ కృష్ణ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారు.ఇక అంబటి మురళీకృష్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ సిటీ మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న బజరంగ్ జుట్టు మిల్ స్థలంలో అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఐదు అంతస్తులకు అనుమతులు తీసుకుని ఏకంగా ఇప్పుడు దానిలో 15 అంతస్తులు కడుతున్నారు. అది 18 అంతస్తులకు చేరిందని వెబ్సైట్లో తాజాగా పెట్టారు. కనీస అనుమతులు లేకుండానే కట్టేస్తున్నారని.. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఇప్పుడు అపార్ట్మెంట్ ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రైల్వే వాళ్లు కూడా 5 అంతస్తులకే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. కార్పొరేషన్ అసలు అలా అపార్ట్మెంట్లు కట్టకూడదని నివేదిక రెడీ చేసింది. దీంతో ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లను వీళ్లు అమ్మకూడదు .. ఎవరూ కొనకూడదు. ఇప్పటికే బుక్ చేస్తున్నవారికి ఎవరి డబ్బు వారికి తిరిగివ్వాలి. మొత్తంగా రాజకీయం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించాలనుకునే వారికి గడ్డు పరిస్థితి తప్పదని ఈ సంఘటన రుజువు చేస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.