ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపులలో మరోసారి మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. ఈ 8 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇవ్వనున్నారు. ఇక రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూను కొనసాగించనున్నారు.
మరోవైపు పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం లాగానే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకే సడలింపు కొనసాగనుంది. ఈ జిల్లాల్లో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు. ఈ కర్ఫ్యూ సడలింపులు జూలై 1 నుంచి జూలై 7వ తేదీ వరకు అమల్లో ఉంటాయని, అనంతరం ఆయా జిల్లాల్లో పాజిటివిటీ రేటు పరిశీలించి, కర్ఫ్యూ సడలింపులపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ముందుగా సోమవారం ఉదయం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, కర్ఫ్యూ కొనసాగింపు, సడలింపులు, వ్యాక్సినేషన్ పై మంత్రులు, కోవిడ్ టాస్క్ఫోర్స్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా కర్ఫ్యూ ఆంక్షల సడలింపుపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ